అనంతపురం జిల్లా రాజకీయాల్లో దివంగత మాజీ మంత్రి పరిటాల రవీంద్ర కుటుంబానికి ఎలాంటి ఇమేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. రవీంద్ర హఠార్మరణం తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన ఆయన సతీమణి సునీత మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి ఇప్పుడు బాబు కేబినెట్లో మంత్రి అయ్యారు. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల నాటికి సునీత తనయుడు శ్రీరామ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు పగడ్బందీ ప్లాన్తో వస్తున్నాడు.
ప్రజల్లో మంచి పేరు తెచ్చుకునేందుకు శ్రీరామ్ తన తండ్రి బాటలోనే పయనిస్తున్నాడు. పరిటాల రవీంద్ర ఫ్యాక్షన్ గొడవల్లో తలమునకలై ఉన్న సమయంలో పేదల కోసం ఉచిత సామూహిక వివాహాలను చేయాలని సంకల్పించారు. ఒకేసారి వేలాది మందికి సామూహిక వివాహాలు రవి ఆధ్వర్యంలో జరిగేవి. అలా ఆయన ఎంతోమంది గుండెల్లో స్థిరస్థాయిగా చోటు సంపాదించుకున్నారు. రవీంద్ర హత్యానంతరం కొంతకాలం ఈ సంప్రదాయానికి బ్రేక్పడింది. అయితే ఇప్పుడు ఆయన తనయుడు పరిటాల శ్రీరామ్ ముందుకొచ్చారు.
శ్రీరామ్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 21న ఏర్పాటుకానున్న ఈ వేడుకకు ముఖ్యమంత్రి ముఖ్యఅతిథిగా హాజరుకాబోతున్నారు. అయితే ఇది శ్రీరామ్ రాజకీయ ఎదుగుదలకు కూడా ఉపకరిస్తుందని చెబుతున్నారు. ఇక జిల్లాలో ప్రతిపక్ష పార్టీలకే కాదు టీడీపీలో కూడా రవి ఫ్యామిలీ ముఖ్యంగా సునీత, శ్రీరామ్ అంటే పడని ప్రత్యర్థులు సైతం శ్రీరామ్ పొలిటికల్గా ఎదిగేందుకు వేస్తోన్న ఎత్తులు చూసి షాకవుతున్నారట. వచ్చే ఎన్నికల్లో పోటీ కోసం శ్రీరామ్ చంద్రబాబుతో పాటు లోకేష్,కరణం వెంకటెష్,రామొహన్ నాయుడు లాంటి యువ నాయుకుల తొ సైతం టచ్లో ఉంటున్నారని టాక్. రాప్తాడు లేదా పెనుగొండలలో ఎక్కడో ఓ చోట నుంచి శ్రీరామ్ బరిలో ఉండే ఛాన్సులున్నాయి.